సూతుడూ – శౌనకాది మునులూ

నైమిశారణ్యంలో ఉండే మునులకు సూతుడు, తాను వ్యాసుడిద్వారా విన్న అనేక పురాణాలు చెప్పాడు. ఒకనాడు శౌనకుడు సూతుణ్ణి దేవీభాగవత పురాణం చెప్పమని కోరాడు. సూతుడు సరేనని మునులకు దేవీభాగవత పురాణం వినిపిస్తానని ఆదిశక్తిని గురించి ఇలా చెప్పాడు:

“ఆమె మహాశక్తి. ఆమెయే విద్య. అన్ని లోకాలూ ఆమెనే ఆశ్రయించి ఉన్నాయి. సృష్టిస్థితి లయాలను కలిగించేది నిజంగా ఆదిశక్తే. ఆమె ప్రేరణద్వారా త్రిమూర్తులు ఆ విధులు నిర్వర్తిస్తారు. బ్రహ్మ విష్ణు నాభి నుంచి పుట్టాడు; విష్ణువుకు ఆధారం ఆదిశేషుడు; ఆదిశేషుడు జలం ఆధారంగా ఉన్నాడు; ఆ జలానికే ఆధారం ‘మహాశక్తి; లోకమాత. అలాంటి దేవికి సంబంధించినది దేవీభాగవతం.”

సూతుడివల్ల దేవీభాగవతం వినాలన్న కుతూహలంతో ఉన్న మునుల పక్షాన శౌనకుడు సూతుడితో, “ఒకప్పుడు బ్రహ్మ మాకు ఒకచక్రం ఇచ్చి, దాని నేమి ఏ ప్రదేశంలో విరిగిపోతే ఆ ప్రదేశం పవిత్రమైనదనీ, అక్కడ కలి ప్రవేశించదనీ చెప్పాడు. ఆ చక్రం ఇరుసు ఇక్కడ విరిగిపోయింది. అందుచేత దీనికి నైమిశం అనే పేరు వచ్చింది. మేం ఇక్కడే ఉండి పోయాం. తిరిగి కృతయుగం వచ్చేదాకా ఇక్కడే ఉండి, కలిభయం లేకుండా ఉంటాం. ఇక్కడ మాకు పుణ్యగోష్ఠి తప్ప మరేమీ లేదు. అందుచేత నువ్వుమాకు పుణ్యప్రదమైన దేవీభాగవత పురాణం వినిపించు,” అన్నాడు.

తిరిగి సూతుడు ఇలా చెప్పాడు:

“వ్యాసమహాముని నాకు ఎలా చెప్పాడో అలా నేను మీకు దేవీభాగవతం చెబుతాను. ఇప్పటికి ఇరవై ఏడు ద్వాపరాలు గడిచి, ఇరవై ఎనిమిదో ద్వాపరం జరుగుతున్నది. ప్రతి ద్వాపరంలోనూ ఒక వ్యాసుడు పుట్టాడు. వేదాలను విభజించి, పురాణాలు రచించిన సాత్యవతేయుడు అనే వ్యాసుడు (సత్యవతి కొడుకు) మా గురువుగారు. ఆయన తన కొడుకైన శుకుడికి ఈ దేవీభాగవతం చెప్పుతూంటే నేను భక్తి శ్రద్ధలతో గ్రహించాను. ‘అల్లుడి వెంట తిను; కొడుకు వెంట చదువు’ అంటారుగద పెద్దలు. ఈ దేవీభాగవతం విని శుకుడు తరించాడు. నిజానికి ఈ పురాణం విన్నవారు కష్టాలు పడటం సాధ్యంకాదు.”

ఇది విని మునులు సూతుణ్ణి, “శుకుడు వ్యాసుడికి ఎలా కొడుకు అయ్యాడు? అతను అరణిలో పుట్టాడనిగదా చెబుతారు?” అని అడిగారు. అప్పుడు సూతుడు మునులకు శుకుడి జన్మవృత్తాంతం ఇలా చెప్పాడు:

ఒకప్పుడు వ్యాసుడు సరస్వతీ నదీతీరాన తపస్సు చేసుకుంటూ, పక్షులు దంపతులుగా జీవిస్తూ పిల్లలను కనటమూ, వాటి నోటికి ఆహారం అందించి, అవి తింటుంటే చూసి ఆనందించటమూ గమనించి, తనకు కూడా సంతానం కలిగితే ఎంత బాగుంటుందో అనే చింతలో పడ్డాడు. చక్కగా పెళ్ళిచేసుకుంటే భార్యతో సుఖపడవచ్చు. కొడుకులను కనవచ్చు. కొడుకులు ముసలితనంలో ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తారు.

అలా అనుకుని వ్యాసుడు కొడుకుల నిమిత్తం తపస్సు చెయ్యటానికి కాంచనాద్రికి వెళ్ళి, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే తనకు శీఘ్రంగా కోరిక నెరవేరుతుందా అని ఆలోచిస్తూండగా, ఆయన ఉన్నచోటికి నారదుడు వచ్చాడు. అతన్ని చూడగానే వ్యాసుడు నమస్కరించి, “స్వామీ, సమాయానికి వచ్చావు. నా కోరిక తీర్చటానికే వచ్చి ఉంటావు,” అన్నాడు.

“సర్వజ్ఞుడివి. నీకు ఒకరి సహాయం అవసరమా? ఏమయినా నీ కోరిక ఏమిటో చెప్పు,” అన్నాడు నారదుడు.

“కొడుకులేనివాడికి పరలోకం ఉండదుట. ఏ దేవుణ్ణి ప్రార్థించితే నాకు కొడుకునిస్తాడు? చెప్పు, నారదా?” అని వ్యాసుడు అడిగాడు.

అప్పుడు నారదుడు ఇలా అన్నాడు:

“ఒకానొకప్పుడు, నా తండ్రి అయిన బ్రహ్మకు ఇదే సందేహం కలిగింది. ఆయన విష్ణు లోకానికి వెళ్లి, విష్ణువును చూసి, నువ్వే సర్వోత్తముడవనుకుంటున్నాను. నీకన్న గొప్పవాడుంటే చెప్పు,” అని అడిగాడు.

దానికి విష్ణువు, “నువ్వు సృష్టించేవాడివనీ, నేను పెంపొందించేవాడిననీ, శివుడు హరించేవాడనీ జనం అనుకుంటారు. ఇది పొరపాటు. తేజస్సుతో కూడిన ఆదిశక్తి మాత్రమే సృష్టి చేస్తుందని బుద్ధిమంతులు గ్రహిస్తారు. మనం సృష్టి స్థితిలయాలు చేస్తున్నామంటే అందుకు కారణం నీకు రజస్సూ, నాకు సత్త్వమూ, శివుడికి తమస్సూ తోడ్పడుతున్నాయి. లేని పక్షంలో మనం గవ్వ విలువ చేస్తామా? నేను ఈ శేషతల్పంమీద పడుకున్నా, లక్ష్మి వెంట ఆరామాలలో విహరిస్తున్నా, పొగరు పట్టిన రాక్షసులను చంపినా ఆ శక్తి దయవల్లనే గదా? వెనక నేను మదుకైటభులనే దానవులతో అయిదువేల ఏళ్లు పోరాడి, చివరకు జయం పొందింది శక్తి సహాయంతో కాదా? నేను స్వతంత్రుడనని ఒక్కనాటికీ అనుకోకు. ఒకసారి వింటినారితో నా తల తెగిపోతే, నువ్వు దేవశిల్పి చేత ఒక గుర్రం తల నాకు ఏర్పాటు చేయించావు. ఆ విధంగా నేను హయగ్రీవుణ్ణి అయ్యానుగదా. అందుచేత నేను శక్తికి అధీనుణ్ణి. శక్తిని మించినది లోకాలలో మరొకటి ఉన్నదని నేను చెప్పలేను, అన్నాడు.

ఇలా చెప్పి నారదుడు వ్యాసుడితో, “నువ్వు ఆదిశక్తిని వేడుకున్నావంటే నీ కోరిక ఈడేరుతుంది,” అన్నాడు.

“వ్యాసుడు లోకమాతను గురించి తపస్సు చేశాడు,” అని సూతుడు మునులకు చెప్పాడు. వెంటనే మునులు, “విష్ణువు తల తెగటం ఎలా జరిగింది? ఆయనకు గుర్రం తల ఎలా అతికారు? ఇదంతా నమ్మదగిన విధంగా చెప్పు” అని సూతుణ్ణి అడిగారు.

స్పందించండి